హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఏ ప్రాణ నష్టం, ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఖైరతాబాద్ తెలుగు తల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే, ప్రమాదం జరిగిన యజమాని వెంటనే అక్కడే కారును వదిలిపెట్టి వెళ్లిపోవడం గమనార్హం. దీంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ను పిలిపించి, కారును పక్కకు తొలగించారు.
కారు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై హ్యుండయ్ వెర్నా కారు టీఎస్ 09 ఈహెచ్ 6241 నంబరు గల కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఎవరూ చుట్టుపక్కల లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. నెక్లెస్ రోడ్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా కారు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఫ్లై ఓవర్ మీద కారు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. కారును పక్కకు తీసి ట్రాఫిక్ను పోలీసులు సరిదిద్దారు.