కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. లాక్డౌన్ సడలింపులతో ప్రజా జీవనం తిరిగి ప్రారంభమయింది. అయితే.. తెలంగాణలో జులై 1 నుంచి బడులు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతి లభిస్తే రాష్ట్రంలో వాటిని యథాతథంగా అమలు చేస్తారు.
వివరాల్లోకెళితే.. విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం.. జులై 1 నుంచి తొలుత ఉన్నత పాఠశాలలను ప్రారంభిస్తారు. ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలను తెరుస్తారు. ఒక తరగతి గదిలో 15 మంది పిల్లలకు మించి అనుమతించరు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారిని క్లాసులకు అనుమతించరు. ప్లే గ్రౌండ్లో ఆటలకు అనుమతించరు. భౌతిక దూరం తప్పనిసరి. 2020-21 విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలను ఏడు పేపర్లకు కుదించింది. అంటే, ఇకపై ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష మాత్రమే.
కాగా.. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉంటారు కాబట్టి, షిఫ్ట్ పద్ధతిలో తరగతులు నిర్వహిస్తారు. ప్రాథమిక పాఠశాలలో ఆది, సోమవారాలు సెలవు. రెండో శనివారం సెలవు ఉండదు. ఈ ఒక్క విద్యా సంవత్సరానికి ప్రాథమిక పాఠశాల సిలబస్ను 70 శాతానికి తగ్గిస్తారు. అలాగే, మొత్తం పనిదినాలను 150 రోజులకు తగ్గించింది ప్రభుత్వం. 8, 9, 10 తరగతుల విద్యార్థుల సంఖ్య 15 మందికి మించితే షిఫ్ట్ విధానంలో తరగతులు నిర్వహిస్తారు. వీరికి ఆదివారం మాత్రమే సెలవు.