కరోనా చికిత్స కోసం ‘కొవిఫర్' ఔషధాన్ని ఆవిష్కరించిన హెటిరో సంస్థ తాజాగా దాని ధరను ప్రకటించింది. 100 మిల్లీ గ్రాముల వయల్ ధరను రూ.5,400 (దాదాపు 71 డాలర్లు)గా నిర్ణయించింది. మొదటివిడుతగా 20వేల వయల్స్ను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. ఇందులో తొలిబ్యాచ్లో 10వేల వయల్స్, తర్వాతి బ్యాచ్లో మరో 10వేల వయల్స్ను పంపిణీ చేయనుంది. తొలి 10వేల వయల్స్ను హైదరాబాద్తోపాటు కరోనా తీవ్రత అధికంగా ఉన్న తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రకు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించింది.
రెండో బ్యాచ్ 10వేల వయల్స్ను వారం రోజుల్లోగా విజయవాడ, కోల్కతా, ఇండోర్, పాట్నా, భువనేశ్వర్, భోపాల్, రాంచీ, కొచ్చిన్, త్రివేండ్రం, గోవాల్లో అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొన్నది. ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు సైతం పంపిణీ చేస్తామని తెలిపింది. ఈ ఔషధం ద్వారా రోగుల చికిత్స సమయం తగ్గి, దవాఖానలపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నట్టు హెటిరో ఎండీ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. దీనిని అన్ని వయసుల వారికి వినియోగించవచ్చని సంస్థ వర్గాలు తెలిపాయి. రోగికి ఎన్ని వయల్స్ వాడాలో వైద్యులు నిర్ణయిస్తారని పేర్కొన్నాయి.