ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, దేవాదాయభూములపై ప్రత్యేకదృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే ఆయాశాఖల వద్ద ఉన్న సమాచారం మేరకు ప్రభుత్వ స్థలాలకు జియో ఫెన్సింగ్ చేయాలని, జీఐఎస్ మ్యాపింగ్చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వభూముల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై శనివారం మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు డీ సుధీర్రెడ్డి, కేపీ వివేకానంద్, అరికెపూడి గాంధీ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్తో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వభూముల పరిరక్షణకు రెవెన్యూశాఖతో జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ భూములపై వివాదాలను పరిష్కరించేందుకు కోర్టుల్లో బలమైన వాదనలను వినిపించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఖాళీస్థలాలను ప్రజాప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఈ స్థలాలు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించిన ఆయన.. జీహెచ్ఎంసీ, టౌన్ప్లానింగ్ అధికారులు మరింత చొరవతో పనిచేయాలని కోరారు. దశాబ్దాల కింద తీసుకున్న లీజ్లను సమీక్షించి,ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలను మార్చి ఆదాయం పెరిగేలా చూడాలని పేర్కొన్నారు.
ప్రభుత్వం దృష్టికి క్రమబద్ధీకరణ
ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లోని భూ సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి స్థానిక ఎమ్మెల్యేలు తీసుకొచ్చారు. జీవో నంబర్ 58, 59 ద్వారా భూ రికార్డుల క్రమబద్ధీకరణ చేసి అర్హులైన పేదలకు ఇప్పటికే భూ హక్కులను కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. మరోసారి ఇలాంటి అవకాశాన్ని కల్పించాలన్న ప్రజాప్రతినిధుల మాటను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. గంపగుత్తగా అందరికీ అవకాశం కల్పించకుండా అంశాలవారీగా సానుకూల దృష్టితో పరిశీలించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు.. సీఎస్ సోమేశ్కుమార్ను కోరారు. సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లతోపాటు రెవెన్యూ, దేవాదాయ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ తదితరశాఖల అధికారులు పాల్గొన్నారు.