అన్నిరంగాలను ప్రభావితం చేసినట్టే స్టార్టప్లపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్నది. దాదాపు 70 శాతం స్టార్టప్లు కరోనా కారణంగా కోలుకోలేకుండా పోతున్నాయి. 12 శాతం స్టార్టప్లు మూతపడగా.. చాలా సంస్థలు కార్యాలయ నిర్వహణతోపాటు సిబ్బంది జీతాలను తగ్గించుకున్నాయి. స్టార్టప్లకు పెట్టుబడి పెట్టాలనుకునేవారు వెనక్కి తగ్గుతున్నారు. కేంద్రం భారీప్యాకేజీ ప్రకటించి స్టార్టప్లను ఆదుకోవాలని, లేకుంటే ఇంకా పెద్ద సంఖ్యలో మూతపడే అవకాశమున్నదని ఆందోళన వ్యక్తమవుతున్నది.
‘ఇంపాక్ట్ ఆఫ్ కొవిడ్-19 ఆన్ ఇండియన్ స్టార్టప్స్' అనే అంశంపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కి), ఇండియన్ యాంగిల్ నెట్వర్క్(ఐఏఎన్) దేశ వ్యాప్తంగా 250 స్టార్టప్లు, 61 ఇంక్యుబెటర్లపై జూన్లో సర్వే నిర్వహించాయి. 70 శాతం స్టార్టప్లపై కరోనా ప్రభావం చూపిందని సర్వే వెల్లడించింది. 33 శాతం స్టార్టప్లకు పెట్టుబడి సాయం చేద్దామనుకున్నవారు కూడా పునరాలోచనలో పడ్డారని తేలింది. 60 శాతం స్టార్టప్లు వ్యాపారపరమైన నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 68 శాతం వాటిలో అత్యధికంగా ఆఫీస్, సంస్థల నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకున్నాయి. లాక్డౌన్ ఇంకా పొడిగిస్తే 30 శాతం సంస్థలు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమయ్యాయి. 43 శాతం సంస్థలు ఇప్పటికే ఉద్యోగుల వేతనాలను 20 నుంచి 40 శాతం కట్ చేస్తున్నాయి.