అడవులతోనే ప్రకృతి సమతుల్యత సాధ్యమని, రాష్ట్రంలో అటవీ ప్రాంతాన్ని పెంచడానికే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా మెగా ప్లాంటేషన్ డేలో పాల్గొని మావల హరితవనం నుంచి చాందా-టీ వరకు రోడ్లకు ఇరువైపులా ఒకే రోజు లక్ష మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, కలెక్టర్ దేవసేనతో మావల హరితవనంలో పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. హరితవనంలో మొక్కలు నాటడంతో పాటు విత్తనాలు చల్లారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అడవుల రక్షణపునురుద్ధరించడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టిసారించారన్నారు. గత ఐదు విడతల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల్లో 70% బతికాయన్నారు. ఈ ఏడాది 30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నా రు. కలప స్మగర్లపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఎఫ్ వినోద్ కుమార్, డీఎఫ్ వో, ఇతర అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.