కరోనా వైరస్ కారణంగా తెలంగాణ ఆర్టీసీ భారీ నష్టాలను చవిచూసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం 9 నెలల్లో సంస్థకు రూ.1800కోట్ల నష్టం వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. అసలే నష్టాల్లో కొనసాగుతున్న తెలంగాణ ఆర్టీసీని కరోనా వైరస్ కకావికలం చేసేసింది. వైరస్ నియంత్రణ కోసం విధించిన లాక్డౌన్ సంస్థను కోలుకోలేని దెబ్బతీసింది. అన్లాక్లో భాగంగా ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్డెక్కినా ప్రయాణికులు ఆదరించకపోవడంతో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో ఆర్టీసీ చరిత్రలోనే కనివీనీ ఎరుగని రీతిలో ఏకంగా రూ.1800కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్నట్టు అధికారులు అంచనా వేశారు. కరోనా వైరస్తో పాటు ఆంధ్రప్రదేశ్తో అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందంలో ఆలస్యం కూడా సంస్థ భారీ నష్టాలకు మరో కారణంగా అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడూ ఏ విపత్కర సమయంలోనూ ఆర్టీసీ ఇంతటి భారీ నష్టాలను చవిచూడలేదని అభిప్రాయపడుతున్నారు. కేవలం ప్రయాణికులపైనే ఆధారపడకుండా గూడ్స్ సర్వీసులు ప్రారంభించినప్పటికీ ఆర్థిక పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వేతన సవరణ అమల్లోకి వచ్చినా, 2013లో కార్మికులకు జారీ చేసిన బాండ్ల చెల్లింపులను అమలు చేస్తే ఆర్థిక పరిస్థితి అంచనా వేయలేమని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీని భారీ నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఏదైనా కీలక చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
Post Top Ad
Thursday, January 14, 2021
కరోనా వైరస్ కారణంగా తెలంగాణ ఆర్టీసీ భారీ నష్టాలు
Tags
# తెలంగాణ ప్రభుత్వం

About AUTHOR
తెలంగాణ ప్రభుత్వం
Tags
తెలంగాణ ప్రభుత్వం
Admin Details
Subha Telangana News